అత్యంత కీలకమైన అణ్వాయుధ స్థావరాలు మీదుగా ఎగురుతున్న చైనా గూఢచారి బెలూన్ను గుర్తించినట్టు అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ గురువారం వెల్లడించింది. అధ్యక్షుడు జో బైడెన్ సూచన మేరకు డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్, ఉన్నత సైనిక అధికారులు బెలూన్ను పేల్చివేయాలని భావించారు కానీ, అలా చేయడం వల్ల చాలా మందికి ప్రమాదం ఏర్పడుతుందని డిఫెన్స్ సీనియర్ అధికారి అన్నారు. వాయువ్య ప్రాంతంలో సున్నితమైన ఎయిర్బేస్లు, క్షిపణి వ్యవస్థలున్న సిలోస్ అండర్గ్రౌండ్ మీదుగా ఈ గూఢచారి బెలూన్ ఎగురుతోందని చెప్పారు.
2025లో అమెరికా, చైనాల మధ్య యుద్ధం తలెత్తే అవకాశం ఉందని యూఎస్ ఎయిర్ మొబిలిటీ కమాండ్ హెడ్ జనరల్ మైక్ మినిహన్ ప్రకటన చేసిన రెండు రోజుల్లోనే ఈ ఘటన జరగడం గమనార్హం. నిఘా కోసం ఉద్దేశించిన ఈ బెలూన్.. ప్రస్తుతం దీని గమనం అనేక సున్నితమైన సైట్ల మీదుగా ఉందని పేరు చెప్పడానికి నిరాకరించిన ఓ అధికారి తెలిపారు. కానీ ఇది ప్రమాదకరమైన గూఢచార ముప్పుగా పెంటగాన్ విశ్వసించడంలేదు. ‘‘ఈ బెలూన్ గూఢచర్యం కోణం పరిమితంగా ఉందని మేము అంచనా వేస్తున్నాం’’ అని అధికారి తెలిపారు.
అమెరికా గగనతలం మీదుగా బెలూన్ రెండు రోజుల కిందటే ప్రవేశించిందని, అంతకు ముందు యూఎస్ ఇంటెలిజెన్స్ దానిని నిశితంగా గమనించింద ఆ అధికారి చెప్పారు. దీని ఎదుర్కోవడానికి చర్యలు ఏంటని అధ్యక్షుడు బైడెన్ కోరడంతో ఫిలిప్పీన్స్ పర్యటనలో ఉన్న ఆస్టిన్, పెంటగాన్ ఉన్నత అధికారులతో బుధవారం చర్చలు జరిపారు.
ఈ అంశంపై చర్చలు జరుగుతుండగా పరిశీలించేందుకు ఫైటర్ జెట్లను పంపారు. కూల్చివేయడం వల్ల ప్రజల భద్రతకు ప్రమాదం ఏర్పడుతుందని భావించి వెనకడుగు వేసినట్టు ఆయన తెలిపారు. వాణిజ్య విమానయానానికి ముప్పు కలిగించకుండా తగినంత ఎత్తులో బెలూన్ ఎగురుతున్నట్లు అధికారి తెలిపారు.
గతంలోనూ అమెరికాపై చైనా నిఘా బెలూన్లను ఎగురవేసింది. అయితే, ఇది అమెరికా గగనతలంలోనే నిర్వీర్యమైంది. ‘అయితే విదేశీ ఇంటెలిజెన్స్ సున్నితమైన సమాచారాన్ని సేకరించకుండా రక్షించడానికి మేము చర్యలు తీసుకుంటున్నాం’ అని అధికారి తెలిపారు.
Read Latest International News And Telugu News