కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకులు, కళాతపస్వి, దాదాసాహెబ్‌ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్ (92) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు.

కొద్ది రోజులుగా వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో కె.విశ్వనాథ్ బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య సమస్యల వల్ల హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. అయితే, గురువారం అర్ధరాత్రి సమయంలో కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు.

గుంటూరు జిల్లా రేపల్లె తాలూకాలోని పెద పులివర్రు అనే గ్రామంలో 1930 ఫిబ్రవరి 19న కాశీనాథుని విశ్వనాథ్ జన్మించారు. బాల్యం, ప్రాథమిక విద్య పెదపులివర్రులోనే గడిచినా ఆ ఊర్లో ఎక్కువ రోజులు నివసించలేదు. విశ్వనాథ్ పాఠశాల విద్య అంతా విజయవాడలో చేశారు. గుంటూరు హిందూ కాలేజీ, ఏసీ కాలేజీల్లో కాలేజీ విద్య పూర్తి చేశారు. బీఎస్సీ డిగ్రీ పట్టా తీసుకున్నారు.

సినీ ప్రస్థానం

చెన్నైలోని ఒక స్టూడియోలో సౌండ్ రికార్డిస్టుగా సినిమా జీవితాన్ని మొదలుపెట్టిన విశ్వనాథ్.. అన్నపూర్ణ సంస్థ నిర్మించిన తోడికోడళ్లు అనే సినిమాకు పనిచేస్తున్నపుడు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుతో పరిచయం ఏర్పడి ఆయన వద్ద సహాయకుడిగా చేరారు. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నిర్మించిన ఆత్మ గౌరవం సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా మారారు. ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది బహుమతి లభించింది. కె విశ్వనాథ్ మొత్తం 60 సినిమాలకు దర్శకత్వం వహించారు. శంకరాభరణం, సాగరసంగమం, స్వర్ణకమలం, సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం వంటి ఎన్నో క్లాసిక్స్ అందించారు. అలాగే, నటుడిగానూ ఎన్నో గొప్ప పాత్రల్లో కె.విశ్వనాథ్ జీవించారు.

శంకరాభరణానికి జాతీయ పురస్కారంతో పాటు సప్తపదికి జాతీయ సమగ్రతా పురస్కారం లభించింది. స్వాతిముత్యం సినిమా 1986లో ఆస్కార్ అవార్డుకు అధికారికంగా ప్రవేశం పొందింది. భారతీయ సినిమాకు చేసిన సమగ్ర సేవకు గాను విశ్వనాథ్‌కు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారమిచ్చి గౌరవించింది. విశ్వనాథ్‌కు 2016లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *