బడ్జెట్లో తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం భారీగా నిధులు కేటాయించింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని రైల్వే ప్రాజెక్టులకు కేటాయించిన నిధుల వివరాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. కాగా.. తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టుల కోసం.. 4 వేల 418 కోట్లను కేంద్రం కేటాయించింది. గతంతో పోలిస్తే.. ఈసారి రికార్డు స్థాయిలో నిధులు కేటాయించింది కేంద్రం. ఇదే సమయంలో.. ఏపీ రైల్వే ప్రాజెక్టుల కోసం 8 వేల 406 కోట్ల నిధులను కేంద్రం కేటాయించినట్టు మంత్రి వెల్లడించారు.
తెలంగాణలో గత బడ్జెట్ కంటే ఈసారి 45 శాతం బడ్జెట్ను పెంచినట్టు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. హైదరాబాద్లో డబ్లింగ్, త్రిబ్లింగ్ పనులకు రూ. 600 కోట్లు కేటాయించినట్టు జైన్ వివరించారు. రెండో దశ ఎంఎంటీఎస్ కోసం 600 కోట్లు నిధులు కేటాయించినట్టు పేర్కొన్నారు. చర్లపల్లి టెర్మినల్ కోసం రూ. 82 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. కాజీపేట- బలహర్ష మార్గంలో థర్డ్ లైన్ పనులకు రూ. 450 కోట్లు కేటాయించామన్నారు. అకొల- డోన్ మార్గంలో డబ్లింగ్ పనుల కోసం రూ. 60 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. కాజీపేట – విజయవాడ థర్డ్ లైన్ పనులకు రూ. 337 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. మరోవైపు బైపాస్ లైన్ల కోసం రూ.383.12 కోట్లు, రైల్వే స్టేషన్ల అభివృద్ధికి రూ. 125 కోట్ల నిధులు కేటాయించినట్టు జైన్ వెల్లడించారు.
97579027
Read More Telangana News And Telugu News