ఒక్క భార్య, ఇద్దరు పిల్లలతో వేగడం కష్టమైన ఈ రోజుల్లో ఓ వ్యక్తి ఏకంగా 12 మందిని పెళ్లాడి 102 మంది పిల్లలను కనేశాడు. సెంచరీ దాటేయడంతో విసిపోయాడో ఏమో.. ఇక పిల్లలు వద్దు బాబోయ్ అంటున్నాడు. అతడే తూర్పు ఉగాండాకు చెందిన 68 ఏళ్ల ముసా హసహ్యా కసేరా. బుగిసాలో నివసిస్తున్న అతడికి 12 మంది భార్యలు, 102 మంది పిల్లలు, 578 మంది మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. కేవలం రెండెకరాల భూమితో ఇన్నాళ్లు నెట్టుకొచ్చాడు. వందల మంది కుటుంబ సభ్యులకు సరిపోయే ఆహారం, దుస్తులు సమాకూర్చలేక సతమతమవుతున్నాడు. దీంతో విసుగెత్తిపోయిన అతడి ఇద్దరు భార్యలు ఇటీవలే వదిలి వెళ్లిపోయారు.
‘‘వంశాన్ని వృద్ధి చేసేందుకు పెద్దల మాట విని 12 మందిని వివాహం చేసుకుని 102 మంది పిల్లలకు తండ్రి అయ్యాను.. 17 ఏళ్ల వయసులో మొదటి వివాహం 1972లో జరిగింది.. పెళ్లైన సంవత్సరానికి మొదటి బిడ్డ సాండ్రా నాబ్వైర్ జన్మించింది.. మొదట్లో సరదాగా ఉండేది కానీ ప్రస్తుతం ఇబ్బందిగా మారింది.. నా ఆరోగ్యం పాడయ్యింది.. రెండు ఎకరాల భూమితోనే పెద్ద కుటుంబాన్ని నెట్టుకురాలేకపోతున్నాను.. ఇటీవలే ఇద్దరు భార్యలు వదిలిపెట్టి వెళ్లిపోయారు’’ అని హసహ్య చెప్పారు.
‘‘నా భార్యలు గర్భనిరోధక సాధనాల్లో ఉన్నారు కానీ నేను కాదు. నేను ఇక పిల్లలను కనాలని అనుకోను, ఎందుకంటే నేను చూసుకోలేని చాలా మంది పిల్లలను పుట్టించే నా బాధ్యతారహిత చర్య అని గుర్తించాను.. వంశాభివృద్ధి కోసం నా సోదరుడు, బంధువులు, స్నేహితులు మాటలు విని ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుని, వంద మంది పిల్లలను కన్నాను ’’ అని అన్నారు. హసహ్య చిన్న భార్య వయసు 35 ఏళ్లు కాగా.. పిల్లల్లో పదేళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వారు ఉండటం గమనార్హం. హసహ్యకు తన పిల్లల్లో చాలా మంది పేర్లు గుర్తులేకపోవడం గమనార్హం. మొదటి, చివరి తప్ప మిగతా పిల్లలను గుర్తించడంలో వారి తల్లుల సహాయం తీసుకుంటానని అన్నారు. నిరుద్యోగి అయిన హసహ్యను చూడటానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఆ గ్రామానికి వస్తుంటారు.
హసహ్య సంతానం ఎక్కువగా శిథిలావస్థలో ఉన్న ఇంట్లో ఉంటున్నారు. దాదాపు రెండు డజన్ల గడ్డితో కప్పిన మట్టి గుడిసెలలో నివసిస్తున్నారు. గ్రామస్తులు తమ కుమార్తెల పెళ్లిళ్లకు సాయం చేయిస్తారని, కొందరు 18 ఏళ్లలోపు వారు కూడా ఉన్నారని చెప్పారు. అంతేకాదు, భార్యల్లో కొందరి పేర్లు కూడా తనకు గుర్తుండవన్నారు. తన కుమారుల్లో ఒకరైన షాబన్ మగీనో టీచర్ కావడంతో కుటుంబానికి అండగా నిలుస్తున్నాడని వివరించారు. కుటుంబంలో ఏదైనా విబేధాలు, సమస్యలు వస్తే నెలకు ఒకసారి సమావేశమైన పరిష్కరించుకుంటారు.
దాదాపు 4,000 మంది జనాభా ఉన్న బుగిసా గ్రామాన్ని పర్యవేక్షిస్తున్న స్థానిక అధికారి మాట్లాడుతూ.. సవాళ్లు ఉన్నప్పటికీ హసహ్య తన పిల్లలను చాలా బాగా పెంచాడని, ఉదాహరణకు దొంగతనం లేదా ఘర్షణ వంటి కేసులు వారిపై లేవని తెలిపారు.
Read Latest International News And Telugu News