ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్

జగన్ సర్కార్ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు శుభవార్త చెప్పింది. ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీం(ఈహెచ్‌ఎస్‌) ద్వారా మెరుగైన వైద్యం అందించేందుకు మరో ముందడుగువేసింది. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలోని సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌లో ప్రత్యేక ఓపీ కౌంటర్‌ మొదలయ్యింది. ఈ కౌంటర్‌‌ను ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు ప్రారంభించి హెల్త్ చెకప్ చేయించుకున్నారు. ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.

ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోనే తొలిసారిగా విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ప్రత్యేక ఓపీ సేవలు ప్రారంభించామన్నారు కలెక్టర్ ఢిల్లీరావు. ప్రతి సోమవారం గ్యాస్ట్రో ఎంట్రాలజీ.. మంగళవారం మానసిక వ్యాధులు, జనరల్‌ మెడిసిన్ పరీక్షలు చేస్తారు. బుధవారం గుండె, కిడ్నీ వ్యాధులు, గురువారం ఆర్థోపెడిక్, న్యూరాలజీ, జనరల్‌ మెడిసిన్.. అలాగే శుక్రవారం చర్మ వ్యాధులు, జనరల్‌ మెడిసిన్.. శనివారం ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించిన పరీక్షలు చేసి మందులు అందిస్తారు.

హైపో థైరాయిడ్, రక్తపోటు, నెఫ్రోటిక్‌ సిండ్రోమ్, రుమటాయిడ్‌ ఆర్థరైటీస్, క్రానిక్‌ కిడ్నీ వ్యాధులు వంటి వాటికి పరీక్షలు చేసి మందులు అందజేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీం(ఈహెచ్‌ఎస్‌) ద్వారా మెరుగైన వైద్యం అందించేందుకు ఈ సేవల్ని ప్రారంభించామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *