వందేభారత్‌ రైల్‌లో స్పెషల్ ‘వడ’.. పిండితే గిన్నెడు నూనె రావాల్సిందే..!

హైదరాబాద్‌ నుంచి వైజాగ్‌కు వందేభారత్ ట్రైన్ పరుగులు పెడుతోంది. అయితే.. రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ సూపర్ ఫాస్ట్‌ వేగంతో పరుగులు తీస్తోన్న ఈ ట్రైన్‌పై ప్రజలు మక్కువ చూపిస్తున్నారు. అయితే.. అందుకు తగ్గట్టుగానే టికెట్ల రేట్లు కూడా ఉన్నాయనుకోండి. ఇదంతా ఒక ఎత్తయితే.. ఈ ట్రైన్‌కు ఉన్న ప్రత్యేకతలు మరో ఎత్తు. వేగం, సీటింగ్, సౌకర్యాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మాత్రం ట్రైన్‌లో ఇచ్చే ఫుడ్. ఎంతో లగ్జరీగా ఉండే ఈ ట్రైన్‌లో ఫుడ్ చాలా క్వాలిటీగా ఉంటుంది.. అనుకుంటే వడలో కాలేసి జర్రున జారినట్టే. అందేంటీ పుసుక్కున అంత మాట అనేశాను అనుకుంటున్నారా.. ఈ వడను చూస్తే మీకే అర్థమవుతుంది.

వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రయాణికుడు బ్రేక్ ఫాస్ట్ తినడానికి వడ ఆర్డర్ చేశాడు. అయితే.. సిబ్బంది ఆ ప్రయాణికుడికి వేడి వేడిగా ఉన్న వడ తీసుకొచ్చి ఇచ్చాడు. ఎంత టేస్టీగా ఉంటుందో అనుకుంటూనే పార్శిల్ ఓపెన్ చేసిన ఆ ప్రయాణికుడికి ఎక్కడో తేడా కొట్టింది. ఆ వడను చూస్తుంటే అప్పుడే ఆయిల్‌లో ముంచి తీసినట్లుగా కనిపిస్తోంది. వడను నూనెలో కాకపోతే ఇంకెక్కడ చేస్తారు అని విసుక్కోకండి. ఆ వడను చూస్తుంటే నూనెలో గోలించినట్టుగా కాకుండా.. నూనెలోనే నానబెట్టి తీసినట్టుగా ఉంది మరి.

అది గమనించిన సదరు ప్రయాణికుడు వడను చేత్తో తీసుకుని గట్టిగా పిసికాడు. దీంతో వడ నుంచి నూనె కారుతూనే ఉంది. వడలను పిండగా రెండు మూడు స్పూన్ల నూనె రావటం గమనార్హం. అంత ఆయిల్‌తో కూడిన వడ తింటే ఇక మన ఆరోగ్యం గోవిందా. లగ్జరీగా ఉన్న ఈ ట్రైన్‌లో ఈవిధంగా బ్రేక్ ఫాస్ట్ లభించటంపై ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మొదటి నుంచే రైళ్లలో ఫుడ్ మీద ప్రజలు అంతగా ఆసక్తి చూపించరు. క్వాలిటీ విషయంలో కానీ.. క్వాంటిటీ విషయంలో గానీ.. సరైన ప్రమాణాలు పాటించరంటూ విమర్శలు వెళ్లువెత్తుతూనే ఉంటాయి. కాగా.. ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందే భారత్ రైల్‌ విషయంలోనూ ఫుడ్‌పై ఇలాంటి విమర్శలే పునరావృతంగా కావటం గమనార్హం.

Read More Telangana News And Telugu News

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *