శంకరాభరణం విడుదల రోజే.. శివైక్యం చెందిన విశ్వనాథ్.. ఆయన సినీ ప్రస్థానంలో కీలక ఘట్టాలు..

K Viswanath Passes Away : కే. విశ్వనాథ్ ఆయన పేరు చెబితే ఒక ‘శంకరాభరణం’, ‘సాగర సంగమం’, ‘స్వాతిముత్యం’, ‘సిరిసిరిమువ్వ’ సినిమాలు గుర్తుకువస్తాయి. తెలుగు సినిమా ఆత్మగౌరవాన్ని జాతీయ స్థాయిలో రెపరెప లాడించిన దిగ్దర్శకుడు. తెలుగు సినిమాకు సిరివెన్నెలలు కురిపించిన ఆపద్భాందవుడు.  తెలుగు సినిమాల్లో సంగీతానికి పెద్ద పీటవేసి, శృతిలయలు నేర్పిన దర్శక యశస్వీ,  ఆయన కళా తపస్వి.. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పద్మశ్రీ  కె.విశ్వనాథ్. ఈ గురువారం (2/2/2023)న ఆయనకు దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించిన పెట్టిన శంకరాభరణం విడుదలై రోజునే కన్నుమూయడం విషాదకరం. ఈయన మృతిపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక సినీ ప్రస్థానం విషయానికొస్తే..

1957లో వచ్చిన ‘తోడికోడళ్లు’ సినిమాకు  సౌండ్ ఇంజనీర్ గా సినిమా కెరీర్ ప్రారంభించారు విశ్వనాథ్. ఆ చిత్ర సమయంలో ఆయన పనితనం గమనించిన దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు, విశ్వనాథ్‌కు సహాయ దర్శకుడిగా అవకాశం ఇచ్చారు.  ఆయన దగ్గరే ‘ఇద్దరుమిత్రులు’, ‘చదువుకున్న అమ్మాయిలు’, ‘మూగమనసులు’, ‘డాక్టర్ చక్రవర్తి’ వంటి అక్కినేని సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేసారు విశ్వనాథ్.ఆ పరిచయంతో  1965లో ‘ఆత్మగౌరవం’ సినిమాకు  దర్శకుడిగా అవకాశం ఇచ్చారు ఏఎన్నార్.  ఆ సినిమా విజయం సాధించినా ఆయనకు వెంటనే అవకాశాలు రాలేదు. మొదట్లో కొన్ని కమర్షియల్ చిత్రాలకు డైరెక్ట్ చేసాడు విశ్వనాథ్ .

కే.విశ్వనాథ్

ఇక కళా తపస్వికి  పేరు తెచ్చిన చిత్రం మాత్రం శోభన్ బాబు హీరోగా వచ్చిన ‘చెల్లెలి కాపురం’. అప్పటి వరకు అందాల హీరోగా పేరున్న శోభన్ బాబుచేత ఈ సినిమాలో  డీగ్లామర్ రోల్ చేయించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

కే.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘చెల్లెలి కాపురం’ సినిమా (Youtube/Photo)

ఆ తరువాత ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘శారద’, ‘సిరి సిరి మువ్వ’ చిత్రాలు మంచి విజయాలను సాధించాయి. ఆయన సినిమాల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన చిత్రం ‘శంకరాభరణం’.  పాశ్చాత్య సంగీతహోరులో కొట్టుకుపోతున్న సంగీతాభిమానులకు.. సంప్రదాయ సంగీతంలో ఉన్న మాధుర్యం ఎంత గొప్పగా వుంటుందో గుర్తుచేసిందీ చిత్రం. శంకరాభరణం తరువాత చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు శాస్త్రీయసంగీతం నేర్పించడానికి ఉత్సాహం చూపించారు. ప్రధాన పాత్రధారి జె.వి.సోమయాజులుకు ‘శంకరాభరణం శంకరశాస్త్రి’ గా పేరు స్థిరపడేటట్టు చేసిందీ చిత్రం. ఈ చిత్ర విజయానికి  మహాదేవన్ సంగీతం, వేటూరి సాహిత్యం, బాలు గాత్రం, జంధ్యాల మాటలు జతకలిసాయి. కేవీమహదేవన్‌కు, దివంగత పద్మవిభూషణ్ బాలుకు జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుడిగా, గాయకుడిగా అవార్డులు లభించాయి. ఈ సినిమా విడుదలైన రోజే విశ్వనాథ్ శివైక్యం చెందారు.

కే.విశ్వనాథ్ సినిమాలు

కమల్ హాసన్ తో ఆయన తీసినా స్వాతిముత్యం.. ఆస్కార్ బరిలో భారత అధికారిక ఎంట్రీగా ఎన్నికైన ఏకైక తెలుగు చిత్రం. కమల్ ఇందులో పండించిన అమాయక నటన తర్వాతి కాలంలో చాలా మంది హీరోలు ఫాలో అయి సక్సెస్ సాధించారు.పూర్ణోదయ సంస్థ అధిపతి ఏడిద నాగేశ్వర్రావు తో కేవీకి ఉన్న అనుబంధం విడదీయరానిది. వారి కాంబినేషన్ లో వచ్చిన ‘శంకరాభరణం’, ‘సాగరసంగమం’, ‘స్వయంకృషి’, ‘స్వాతిముత్యం’, ‘స్వర్ణ కమలం’ ‘ఆపద్భాందవుడు’ ‘స్వాతి కిరణం’ వంటి విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు.

స్వాత ముత్యం షూటింగ్ సమయంలో కే.విశ్వనాథ్

హీరో  గుడ్డివాడు , హీరోయిన్ మూగ అమ్మాయి.. ఇలాంటి కథతో సినిమా ఏంటి అన్న నోళ్లతో సినిమాతీసి సక్సెస్  సాధించడం ఆయనకు మాత్రమే చెల్లింది. ‘సిరి వెన్నెల’ చిత్రంలో గుడ్డివాడిగా సర్వదమన్ బెనర్జీ , మూగ అమ్మాయిగా సుహాసిని నటన మనం ఇప్పటికీ మరచిపోలేం. ఈ సినిమాతో పాటల రచయత దివంగత సీతారామశాస్త్రి  ఇంటి పేరు ‘సిరివెన్నెల‘ గా మారిపోయింది.

కే.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సిరివెన్నెల’ (Youtube/Credit)

అనేక సామాజిక కథాంశాలతో తీసిన చిత్రాలు విజయాన్ని నమోదు చేసాయి. వరకట్న సమస్యపై ‘శుభలేఖ’, కులవ్యవస్థపై ‘సప్తపది’, గంగిరెద్దు వాళ్ల జీవితంగౌ ఆధారంగా ‘సూత్రధారులు’, బద్దకస్తుడి కథ ఆధారంగా ‘శుభోదయం’ చిత్రాలు ఆయనలోని సంఘ సంస్కర్తను సూచిస్తుంది.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని గురించి ఈ విషయాలు తెలుసా.. ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే..

టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటారు విశ్వనాథ్ గారు, ఆయన తీసిన హిట్ చిత్రాలను హిందీలో రీమేక్ చేసి విజయం సాధించారు. ‘సిరిసిరిమువ్వ’ను ‘సర్గమ్’గా, ‘శుభోదయం’ చిత్రాన్ని ‘కామ్‌చోర్’ గా, ‘శంకరాభరణాం’ సినిమాను ‘సుర్ సంగమ్’గా తీసి హిట్టు కొట్టారు కేవీ.

హిందీలో సత్తా చాటిన కే.విశ్వనాథ్

‘శుభ సంకల్పం’ సినిమాతో నటుడిగా మారి ఆ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. చాలా కాలం తరువాత తీసిన ‘స్వరాభిషేకం’, ‘శుభప్రదం’ వంటి చిత్రాలు చేసినా.. నేటి ట్రెండ్ అనుగుణంగా విజయం సాధించలేకపోయారు. విశ్వనాథ్ తన చిత్రానికి దర్శకత్వం వహించేటపుడు ఖాకీ దుస్తుల్లో ఉండటం ఆయన ప్రత్యేకత.

ఖాకీ దుస్తుల్లో కే.విశ్వనాథ్

విశ్వనాథ్ కు చలన చిత్రరంగానికి చేసిన కృషికి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 1992 లో రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డుతో సత్కరించింది. దీంతో పాటు పలు నంది అవార్డులు, జాతీయ అవార్డులు ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాయి. ఇక హిందీలో కూడా ఈయన సత్తా చాటారు. అక్కడ సిరిసిరిమువ్వ చిత్రాన్ని హిందీలో రిషీకపూర్, జయప్రదలతో ‘సర్గమ్’గా రీమేక్ చేసారు. అటు శుభోదయం మూవీని‘కామ్‌చోర్’గా తెరకెక్కించారు. శంకరాభారణం చిత్రాన్ని ‘సుర్ సంగమ్’గా రీమేక్‌గా చేసారు. ఇక చివరగా 2010లో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ‘శుభప్రదమ్’ సినిమాను డైరెక్ట్ చేసారు. అటు శుభసంకల్పంతో ముఖానికి రంగేసుకున్నారు. ఆ తర్వాత నటుడిగా నరసింహానాయుడు, అల్లరి రాముడు, ఠాగూర్, వజ్రం, సంతోషం, లాహిరి లాహిరి లాహిరిలో వంటి సినిమాల్లో నటించారు. చివరగా 2022లో కన్నడ చిత్రం ‘ఒప్పంద’లో నటించారు. తెలుగులో చివరగా రామ్ హీరోగా నటించిన ‘హైపర్’లో ముఖ్యమంత్రి పాత్రలో నటించారు.

Taraka Ratna: తారకరత్న ఆరోగ్యం కోసం ఆ ఆలయంలో బాలయ్య అఖండ దీపారాధన.. అబ్బాయి కోసం బాబాయి..

కేంద్రం ఆయన్ని 2016లో దేశంలో సినీ రంగంలో ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో గౌరవించింది. ఎన్ని చిత్రాలు తీసినా తన చిత్రాల్లో భావుకత, ఆర్ధ్రత, కుటుంబ, సామాజిక అంశాలు సృజించడంలో విశ్వనాథ్ శైలే వేరు.

కేంద్రం నుంచి దాదా ఫాల్కే అవార్డు అందుకున్న కళాతపస్వీ

ఆయన జీవితంపై ప్రముఖ దర్శకుడు జనార్దన మహర్షి..‘విశ్వదర్శనం’సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆయన తీసిని సినిమాలు ఇప్పటి దర్శకులకు  ఒక ఆదర్శం. తెలుగు సినిమా ఉన్నంత కాలం కే. విశ్వనాథ్ సినిమాలు నిలిచే వుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన మృతితో తెలుగు సినీ కళామతల్లికి తీరని లోటు అని చెప్పాలి. ఆయన మృతికి న్యూస్ 18 నివాళులు అర్పిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *