ఉద్యోగులకు ఖరీదైన బహుమతులిచ్చిన ఐటీ కంపెనీ ఆర్ధిక మాంద్యం భయాలతో ప్రపంచవ్యాప్తంగా ఐటీ దిగ్గజ సంస్థలు ఖర్చులను తగ్గించుకునే పనిలో ఉన్నాయి. ఈ క్రమంలో పలు సంస్థలు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. గూగుల్, అమెజాన్ వంటి పలు అంతర్జాతీయ సంస్థలు ఉద్యోగులను భారీగా తొలగిస్తున్నాయి. రోజుకో కంపెనీ లేఆఫ్ ప్రకటిస్తుండటంతో సాఫ్ట్వేర్ నిపుణులు, ఆశావహుల్లో గుబులు మొదలైంది. ఈ నేపథ్యంలో ఇండియాకు చెందిన ఓ ఐటీ సంస్థ మాత్రం తమ ఉద్యోగులకు బహుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తోంది.
అహ్మదాబాద్లోని త్రిథ్యా టెక్ అనే ఐటీ కంపెనీ తమ ఉద్యోగులకు ఖరీదైన కార్లు బహుమతి ఇచ్చింది. ఆ కంపెనీ ఐదేళు పూర్తి చేసుకున్న సందర్భంగా 13 మంది ఉద్యోగులకు టయోటా కార్లను బహూకరించింది. ఉద్యోగులు పడిన శ్రమకి మంచి ఫలితాలు వచ్చాయని.. వారి వల్లే సంస్థ లాభాలు పెరిగాయని త్రిథ్యా టెక్ మేనేజింగ్ డైరెక్టర్ వెల్లడించారు. ఉద్యోగుల కృషికి గుర్తింపుగా కార్లు అందజేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రోత్పాహకాలు ఉంటాయన్నారు. కాగా, ఈ సంస్థ ఈ-కామర్స్, వెబ్, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ వంటి సాంకేతిక సేవలను అందజేస్తోంది. త్రిథ్యా టెక్ సంస్థకు ఆసియా, ఐరోపా, ఆస్ట్రేలియాలోనూ క్లయింట్స్ ఉన్నారు.
©️ VIL Media Pvt Ltd.