Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన గన్మెన్లందరినీ ప్రభుత్వానికి సరెండర్ చేశారు. తనకు గన్మెన్లను కుదిస్తూ శనివారం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్పందించేందుకు ఆదివారం కోటంరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తన గన్మెన్లు అందరినీ ప్రభుత్వానికి వెనక్కి ఇచ్చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మీడియా సమావేశంలోనే ఇద్దరు గన్మెన్లు కంటతడి పెట్టుకోగా.. వారిని ఓదార్చుతూ కోటంరెడ్డి కూడా భావోద్వేగానికి గురయ్యారు. ‘ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాను. నాకు గన్మెన్లు అవసరం లేదు. నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ సమయంలో అదనపు భద్రత కల్పించకపోగా.. భద్రతను కుదించారు. నాకు కార్యకర్తలే రక్ష. మానసికంగా ఇబ్బంది పెట్టారనే గన్మెన్లను తొలగించారు. మీకే గిఫ్ట్ ఇస్తున్నా.. మిగిలిన ఇద్దరు కూడా నాకు వద్దు’ అని కోటంరెడ్డి పేర్కొన్నారు.
‘నాకు వైసీపీ ప్రభుత్వం 2+2 గన్మెన్లను ఇచ్చింది. నిన్న ఇద్దరు గన్మెన్లను వాపసు తీసుకోవాలని ఆదేశించారు. ఎవరి ఆదేశాలతో ఈ పని చేశారో తెలియదు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్పనిదే ఈ పని చేయరు. అనేకచోట్ల నుంచి నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పా. ఇలాంటి సమయంలో ఇంకా నాకు అదనంగా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. అలా కాకుండా ఉన్నవాళ్లలో ఇద్దరిని తొలగిస్తారా?’ అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.