Rohit Sharma: తేలనున్న రోహిత్ కెప్టెన్సీ ఫ్యూచర్ మరో ఐసీసీ ట్రోఫీని కోల్పోలేమన్న బీసీసీఐ
న్యూఢిల్లీ: ఓవైపు టీమిండియా ప్రతిష్టాత్మక బోర్డర్–గావస్కర్ ట్రోఫీ కోసం రెడీ అవుతుంటే… మరోవైపు రోహిత్ శర్మ టెస్ట్ కెప్టెన్సీపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. విరాట్ కోహ్లీ నుంచి సారథ్యం స్వీకరించిన తర్వాత రోహిత్.. రెండు మేజర్ ఐసీసీ టోర్నీలైన ఆసియాకప్, టీ20 వరల్డ్కప్లో ఇండియా టీమ్ను నడిపించాడు. కానీ ఆ రెండింటిలోనూ అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోయాడు. ఈ నేపథ్యంలో రోహిత్ టెస్ట్ కెప్టెన్సీకి ఇప్పుడు ఆస్ట్రేలియాతో సిరీస్ కఠిన సవాల్గా మారింది. ఈ నెల 9 నుంచి మొదలయ్యే ఈ మెగా సిరీస్ (4 టెస్ట్లు)ను గెలవడంతో పాటు ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లోనూ టీమిండియా విజయం సాధించి తీరాలి. అలా జరిగితేనే హిట్మ్యాన్.. టెస్ట్ కెప్టెన్గా మరికొన్ని రోజులు ముందుకు సాగుతాడు. లేదంటే అతని ప్లేస్లో కేఎల్ రాహులో లేక మరెవరైనా రావచ్చొనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని బీసీసీఐ ఇప్పటికే రోహిత్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
కొత్త కెప్టెన్తోనే..!
మార్చిలో శ్రీలంకతో జరిగిన రెండు టెస్ట్లో ఇండియా అద్భుతమైన విజయాలు సొంతం చేసుకుంది. తొలి టెస్ట్లో ఇన్నింగ్స్ 222 రన్స్తో, తర్వాతి మ్యాచ్లో 238 రన్స్తో నెగ్గింది. ఈ రికార్డుల పరంగా రోహిత్కు తిరుగులేదు. అయితే దీనిని లెక్కలోకి తీసుకుని బోర్డర్–గావస్కర్ ట్రోఫీని వదిలేస్తే మొదటికే మోసం వస్తుంది. ఇందులో ఓడినా, డబ్ల్యూటీసీ ఫైనల్లో రాణించకపోయినా.. కచ్చితంగా టీమిండియాకు కొత్త కెప్టెన్ వస్తాడనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్తో 2021–23 సైకిల్ పూర్తవుతున్న నేపథ్యంలో కొత్త కెప్టెన్ హయాంలో 2023–25 సైకిల్ను మొదలుపెట్టాలని బీసీసీఐ భావిస్తోంది. ‘కెప్టెన్సీ మార్పు గురించి చర్చించలేదు. కానీ కొత్త సైకిల్లోనూ కెప్టెన్గా కొనసాగాలంటే కచ్చితంగా ఫలితాలు చూపెట్టాలి. ఆ రిజల్ట్స్ను బట్టే సారథిని కొనసాగించాలా? వద్దా? అనేది డిసైడ్ అవుతుంది’ అని బీసీసీఐ అధికారి పేర్కొన్నాడు. ఇక రోహిత్ పరంగా ఆలోచిస్తే.. అతను కేవలం లంకతో రెండు టెస్ట్లకు మాత్రమే పూర్తిస్థాయి కెప్టెన్గా పని చేశాడు. ఓ రకంగా చెప్పాలంటే టీమ్ను సరైన స్థాయిలో నడిపించే అవకాశం ఇప్పటివరకు అతనికి రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అతని కెప్టెన్సీని అంచనా వేయడం చాలా అన్యాయం. అయితే రోహిత్ వయసు, టైమ్ అతనికి అడ్డంకిగా నిలుస్తున్నాయి. దీంతో ధోనీ, కోహ్లీలాగే రోహిత్ కూడా మధ్యలోనే నిష్క్రమించాల్సి వస్తుందేమో.
ఆ ఒక్కటి మినహా..
2013కు ముందు ఇండియా చివరిసారి ఐసీసీ ట్రోఫీని నెగ్గింది. ఆ తర్వాత 2018లో ఆసియా కప్ను సొంతం చేసుకుంది. రోహిత్ కెప్టెన్ అయ్యాక.. ద్వైపాక్షిక సిరీస్ల్లో టీమిండియా సూపర్ పెర్ఫామెన్స్ చేస్తోంది. వన్డే, టీ20ల్లో ఇండియా నంబర్వన్ ర్యాంక్ను సాధించింది. టెస్ట్ల్లోనూ టాప్ ర్యాంక్కు చేరువవుతోంది. కానీ రోహిత్ ఒక్క ఐసీసీ ట్రోఫీని మాత్రం సాధించిపెట్టలేకపోతున్నాడు. బైలేటరల్ సిరీస్లో ఎంత రాణించినా.. ఐసీసీ ట్రోఫీతో వచ్చే పేరు ప్రతిష్టలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. అందుకే బీసీసీఐ కూడా ఐసీసీ ట్రోఫీ కోసం ఆతృతగా వెయిట్ చేస్తోంది. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో ఐసీసీ ట్రోఫీని కోల్పోలేం. ఈ విషయాన్ని రోహిత్కు తెలిపాం. మనం వరల్డ్కప్ గెలవకపోతే ద్వైపాక్షిక సిరీస్లో ఎన్ని విజయాలు సాధించినా వృథాయే. అందుకే ఈసారి ఆ కరువు నుంచి బయటపడాలని భావిస్తున్నాం’ అని బీసీసీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
©️ VIL Media Pvt Ltd.