ప్రకృతి విలయతాండవానికి టర్కీ, సిరియాలు చిగురుటాకులా వణికిపోయాయి. ఎటుచూసినా కుప్పకూలిన భవనాలు, శిథిలాలే దర్శనమిస్తున్నాయి. శిథిలాల నుంచి గుట్టలుగా శవాలు బయటపడుతున్నాయి. సోమవారం వరుసగా సంభవించిన శక్తిమంతమైన భూకంపాలతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. భూకంప తీవ్రతకు అనేక భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. టర్కీలోని హతయ్ ప్రావిన్సుల్లోని ఎయిర్పోర్టురన్వే (Runway) భూకంపం ధాటికి రెండు ముక్కలై ఎందుకూ పనికిరాకుండా పోయింది.
హతయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులోని ఒకే ఒక్క రన్వే ఉండగా.. అది పూర్తిగా ధ్వంసమైంది. భారీగా పగుళ్లు ఏర్పడి రెండుగా చీలిపోయింది. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ ఎయిర్పోర్టులో విమాన రాకపోకలు నిలిచిపోయాయి. భూకంప తీవ్రతకు టర్కీలో 5600లకు పైగా భవనాలు కూలిపోయాయి. ఈ ఘోర విపత్తు కారణంగా రెండు దేశాల్లో ఇప్పటివరకు 5000 మందికిపై మృత్యువాత పడగా.. దాదాపు 20వేల మంది గాయపడ్డారు. అయితే శిథిలాల కింద ఇంకా అనేక మంది చిక్కుకున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని తెలుస్తోంది.
తొలుత సోమవారం తెల్లవారుజామున 4.17 నిమిషాలకు 7.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. అనంతరం 10 గంటల్లోనే 50కిపైగా ప్రకంపనలు సంభవించాయి. మరికొన్ని రోజుల పాటు ప్రకంపనలు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరోవైపు ఈ సంక్షోభంపై అంతర్జాతీయంగా స్పందించాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో టర్కీని ఆదుకోడానికి పలు దేశాలు ముందుకొచ్చాయి. భారత్, యూరోపియన్ యూనియన్ రెస్క్యూ బృందాలను టర్కీకి పంపుతోంది. నెదర్లాండ్స్, రొమేనియాలు ఇదే దారిలో ఉన్నాయి. 76 నిపుణులు, పరికరాలు, రెస్క్యూ జాగిలాలను పంపనున్నట్లు బ్రిటన్ తెలిపింది. ఫ్రాన్స్, జర్మనీ, ఇజ్రాయేల్, అమెరికా,రష్యాలు సాయానికి ముందుకొచ్చాయి.
Read Latest International News And Telugu News