రాత్రిపూట అమ్మాయిని రహస్యంగా కలవడానికి వచ్చాడని ఆరోపిస్తూ ఓ యువకుడ్ని గ్రామస్థులు పట్టుకుని చెట్టుకు కట్టేసి చితకబాదారు. అంతటితో ఆగకుండా అతడి నోటిలో మూత్రం పోశారు. అత్యంత అమానుష ఈ ఘటన రాజస్థాన్లోని జలోర్ జిల్లాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. ఆరుగురిని అరెస్ట్ చేసి.. బాధిత యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. బాధిత యువకుడు ఆదివారం రాత్రి సమీప గ్రామంలోని బాలికను రహస్యంగా కలవడానికి వచ్చాడు. ఈ విషయం గ్రామస్థులకు తెలియడంతో అతడ్ని పట్టుకుని చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. సమాచారం అందుకున్న యువకుడి కుటుంబసభ్యులు కూడా అక్కడకు చేరుకుని, వదిలిపెట్టాలని ప్రాధేయపడ్డారు. అయినా సరే గ్రామస్థులు కనికరించలేదు. మరింత ఆగ్రహంతో రెచ్చిపోయిన కొందరు యువకుడి నోటిలో మూత్రం పోశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు.
జలోర్ ఎస్పీ హర్షవర్థన్ అగర్వాలా చర్యలు చేపట్టారు. ఘటనపై ముందుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయని పోలీసులు… బాధితుడి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. అతడి ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనలో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు జలోర్ ఎస్పీ తెలిపారు. అలాగే, ఆ యువకుడిపై సదరు బాలిక పోక్సో చట్టం కింద ఫిర్యాదు చేసింది. ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత తదుపరి విచారణ సాగిస్తామని ఎస్పీ వెల్లడించారు. ఘటనకు సంబంధించిన వీడియో సోమవారం వైరల్ అయినట్టు చెప్పారు.
Read Latest Crime News And Telugu News