రాష్ట్రమంతటా న్యూట్రిషనల్ కిట్లు బడ్జెట్లో రూ.200 కోట్ల కేటాయింపు
మెడికల్ కాలేజీలకు రూ.వెయ్యి కోట్లు
సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లకు తగ్గిన నిధులు
మొత్తంగా హెల్త్కు రూ.12,161 కోట్లు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని 9 జిల్లాల్లో గతేడాది ప్రారంభించిన కేసీఆర్ న్యూట్రిషనల్ కిట్స్ స్కీమ్ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో అమలవుతున్నది. దీన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు ఈ బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్టు పేర్కొంది. గర్భిణుల్లో రక్తహీనత సమస్యకు చెక్ పెట్టేందుకు రెండు కిట్ల చొప్పున పంపిణీ చేయనున్నారు. ఈ కిట్లలో పోషకాహార పదార్థాలు, ఐరన్ ట్యాబెట్లు, సిరప్ ఉంటాయి. ఇక ఈసారి బడ్జెట్లో ఆరోగ్య రంగానికి మొత్తం రూ.12,161 కోట్లు కేటాయిస్తున్నట్టు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ఇది గతేడాది కంటే రూ.924 కోట్లు ఎక్కువ అయినప్పటికీ, మొత్తం బడ్జెట్లో హెల్త్ వాటా రూ.4.18 శాతానికే పరిమితం చేశారు. గత బడ్జెట్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ల నిర్మాణానికి రూ.వెయ్యి కోట్లు పెట్టిన సర్కార్, ఈసారి రూ.500 కోట్లకు తగ్గించింది. ఇప్పటిదాకా హైదరాబాద్లోని ఒక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు కూడా మొదలు కాలేదు. సనత్నగర్, కొత్తపేట్, అల్వాల్ సూపర్స్పెషాలిటీ హాస్పిటళ్లకు ఒక్క ఇటుక కూడా వేయకుండానే బడ్జెట్ తగ్గించారు. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి మాత్రం గతేడాది తరహాలోనే రూ.వెయ్యి కోట్లు కేటాయించారు. వీటిలో మెషినరీ కోసం రూ.33 కోట్లు, నాన్ మెడికల్ ఎక్విప్మెంట్ కోసం రూ. 275 కోట్లు ప్రతిపాదించారు.
కంటి వెలుగుకు రూ.25 కోట్లు
ఆరోగ్యశ్రీకి గతేడాది కంటే రూ.120 కోట్లు అధికంగా రూ.1,101 కోట్లు కేటాయించారు. ఈహెచ్ఎస్కు 362 కోట్లు, ఆయుష్మాన్ భారత్ మ్యాచింగ్ గ్రాంట్ కోసం రూ.115 కోట్లు కేటాయించారు. కేసీఆర్ కిట్కు రూ.443 కోట్లు ప్రతిపాదించారు. ఎంఎన్జే హాస్పిటల్కు రూ.37.76 కోట్లు, నిమ్స్కు రూ.15.67 కోట్లు ఇస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ దవాఖాన్లలో మందుల కొనుగోలు కోసం రూ.377.43 కోట్లు కేటాయించారు. కంటి వెలుగు కార్యక్రమం కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెబుతున్న సర్కార్, బడ్జెట్లో మాత్రం రూ.25.58 కోట్లు మాత్రమే కేటాయించింది. వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉండే జిల్లా, ఏరియా హాస్పిటళ్ల అప్గ్రెడేషన్, స్ట్రెంథనింగ్ కోసం రూ.250 కోట్లు ప్రతిపాదించారు. ప్రైమరీ హెల్త్ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల ఏర్పాటుకు డబ్బులు కేటాయించాలన్న డాక్టర్ల డిమాండ్ను సర్కార్ పట్టించుకోలేదు. నాన్ కమ్యునికబుల్ డిసీజెస్ కంట్రోల్ ప్రోగ్రామ్కు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం గమనార్హం. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రభుత్వ దవాఖాన్లకు వచ్చే పేషెంట్ల అటెండెంట్లకు భోజనం పెట్టేందుకు రూ.70 కోట్లు కేటాయించారు.
©️ VIL Media Pvt Ltd.