టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. లోకేష్ను వివిధ వర్గాల ప్రజలు కలుస్తున్నారు. ఈ క్రమంలోనే లోకేష్తో ఓ ఏపీఎస్ఆర్టీసీ బస్ డ్రైవర్ కరచాలనం చేశారు. తన మొబైల్కు ఉన్న చంద్రబాబు కవర్ను అందరికీ చూపిస్తూ ప్రదర్శించారు. అయితే ఆర్టీసీ బస్ డ్రైవర్ తనకు కరచాలనం చేశారని ఉద్యోగం నుంచి తొలగించారని లోకేష్ ఆరోపించారు. తనకు మద్దతు తెలిపినందుకు డ్రైవర్ను విధుల నుంచి తొలగించారని విమర్శించారు.
ఆర్టీసీ డ్రైవర్ తన అభిమానాన్ని మాత్రమే చాటుకుంటున్నారని.. ఆయన ఏం నేరం చేశారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత భయం ఎందుకని..ఇది పాలకుల్లో ఉన్న భయానికి నిదర్శనమని, పాదయాత్ర పట్ల భయం లేకపోతే తమ ప్రచార వాహనాలను ఎందుకు సీజ్ చేసారని ఆయన అన్నారు. ఈ విషయం సోషల్మ మీడియాలో వైరల్ అయ్యింది. కొంతమంది ఈ విషయాన్ని ఆర్టీసీ దృష్టికి తీసుకెళ్లారు.. దీంతో ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు.
డ్రైవర్ను ఉద్యోగం నుంచి తొలిగించారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆర్టీసీ చెబుతోంది. ఇదంతా తప్పుడు ప్రచారమని.. ఇది పూర్తిగా తప్పుడు కథనమని.. కొన్ని మీడియాల్లో వచ్చిన ఈ వాదనలను తాము తీవ్రంగా ఖండిస్తున్నాము అంది. దీంతో నెటిజన్లు తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశమైంది.