రేపొ రేటును పెంచిన ఆర్బీఐ..భారం కానున్న ఈఎంఐ,లోన్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును పెంచుతున్నట్లు ప్రకటించింది. 25 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును పెంచినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. దీంతో మొత్తం రెపో రేటు 6.50 శాతానికి చేరినట్లయింది. చివరిసారిగా2 022 డిసెంబర్లో ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్వహించారు. ఆ సమయంలో 35 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటును రిజర్వ్ బ్యాంక్ పెంచింది.
రెపో రేటు పెరగడంతో బ్యాంక్ కస్టమర్లపై ప్రభావం పడనుంది. లోన్లపై వడ్డీ రేట్లు పెరగనున్నాయి. అంతేకాకుండా నెలవారీ ఈఎంఐలు మరింత పెరిగే ఛాన్సుంది. అలాగే రుణ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంటాయి. దీంతో లోన్లు మరింత భారం కానున్నాయి. అయితే రెపో రేటు పెరగడం వల్ల బ్యాంకుల్లో నగదు దాచుకునే వారికి వడ్డీ రేట్లు పెరగనున్నాయి.
మరోవైపు 2023-24లో ద్రవ్యోల్బణం 4శాతం లక్ష్యం కంటే ఎక్కువగానే ఉండొచ్చని శక్తికాంత్ దాస్ అభిప్రాయపడ్డారు. మార్జినల్ స్టాండింగ్ రేటును 6.75గా మార్చినట్లు పేర్కొన్నారు. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ను 6.25కు సర్దుబాటు చేశామన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధిరేటు 7శాతంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అంచనావేశారు.
©️ VIL Media Pvt Ltd.