Delhi Liquor Scam: కవిత మాజీ సీఏను అరెస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే.. లిక్కర్ స్కాంలో మరొకరు అరెస్ట్

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో గౌతమ్ మల్హోత్రాను బుధవారం ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీకి చెందిన బ్రికంక్ కో సేల్స్ సంస్ధకు డైరెక్టర్‌గా ఆయన ఉన్నారు. ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన ఛార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును ఉదయం సీబీఐ అరెస్ట్ చేయగా.. కొన్ని గంటల్లోనే మరొకరిని ఈడీ అరెస్ట్ చేయడం కీలకంగా మారింది.

ఒకేరోజు ఇద్దరి అరెస్ట్‌లతో ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ, ఈడీ దర్యాప్తు మరింత వేగవంతం చేసినట్లు అర్ధమవుతుంది. ఇటీవల ఈ కేసులో రెండో ఛార్జ్‌షీట్‌ను కోర్టులో సీబీఐ దాఖలు చేసింది. ఇందులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్లను ప్రస్తావించడం దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఏపీకి చెందిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డితో పాటు అధికార వైసీపీ నేతలతో సంబంధం కలిగి ఉన్న పలువురు వ్యక్తుల పేర్లను ఛార్జిషీట్‌లో సీబీఐ ప్రస్తావించింది.

ఇవాళ ఉదయం బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్ చేయగా.. ఆయనను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించింది. మధ్యాహ్నం ఆయనను కోర్టు ముందు హాజరుపర్చనుంది. ఈ కేసులో బుచ్చిబాబు పాత్రను కోర్టుకు సీబీఐ వివరించనుంది. ఒకేరోజు ఇద్దరిని అరెస్ట్ చేయడంతో.. రానున్న రోజుల్లో మరిన్ని అరెస్ట్‌లు జరిగే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే మరికొంతమందికి ఈ కేసులో విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసే అవకాశముందని తెలుస్తోంది.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *