టర్కీ, సిరియాలపై విరుచుకుపడిన భూకంపం.. వేలాది మందిని పొట్టనబెట్టుకుంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడ చూసినా హృదయాలను కలిచివేసే దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించడం కోసం రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. శక్తివంతమైన భూకంపంతో భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. శిథిలాల కింద ఉన్నవారి కోసం జల్లెడపడుతున్నారు. కాగా, వాయవ్య సిరియాలోని జిందెరిస్ పట్టణంలో ఓ భవనం శిథిలాల్లో చిక్కుకున్న ఇద్దరు చిన్నారులను రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటికి తీశారు.
శిథిలాల కింద చిక్కుకునన నూర్ అనే చిన్నారి ఆచూకీ కోసం ఆమె తండ్రి గాలించాడు. రెస్క్యూ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సహాయక చర్యలు చేపట్టారు. నూర్ జాడ కనిపెట్టిన రెస్క్యూ టీమ్.. ఆ చిన్నారికి ధైర్యం కల్పించారు. తన తండ్రి అక్కడే ఉన్నాడని.. ఆయనతో మాట్లాడాలని సూచించారు. నూర్ తండ్రి పక్కనే ఉండగా శిథిలాల నుంచి చిన్నారిని సురక్షితంగా బయటికి తీశారు. దీంతో నూర్ కుటుంబ సభ్యులతోపాటు సహాయక సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
అదే పట్టణంలో హరూన్ అనే మరో బాలుడిని శిథిలాల నుంచి సజీవంగా రెస్క్యూ సిబ్బంది బయటికి తీశారు. శిథిలాల కింద ప్రాణ భయంతో ఉన్న హరూన్ను కాపాడారు. ‘‘హరూన్ నువ్వు ఒక హీరోవి బయటికి రా’’ బాలుడికి ధైర్యాన్ని నూరిపోసి ప్రోత్సహించారు. చిమ్మచీకటిలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న ఆ చిన్నారిని సురక్షితంగా బయటికి తీశారు.
మరోవైపు అంటక్యాలో భవన శిథిలాల కింద తన తల్లి స్వరం వినిపించిందని, కానీ ఆమెను కాపాడేందుకు రెస్క్యూ సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తన తల్లికి 70 సంవత్సరాలని.. ఎక్కువ సేపు ఆమె అక్కడ ఉండలేదని ఆందోళన వ్యక్తం చేసింది. మలాత్యాలో మిరాన్ అనే మూడేళ్ల బాలుడ్ని 22 గంటల అనంతరం శిథిలాల నుంచి క్షేమంగా బయటకు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Read Latest International News And Telugu News