హైదరాబాద్‌ నగరవాసులకు బ్యాడ్‌ న్యూస్‌.. మరో 10 రోజులపాటు ఆ తిప్పలు తప్పవు !

Hyderabad Traffic: హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ జామ్‌లతో వాహనదారులు అల్లాడిపోతున్నారు. నగర వ్యాప్తంగా ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడటంతో మూడ్రోజులుగా ప్రజలు ముప్పతిప్పలు పడుతున్నారు. మంగళ, బుధవారాలు ట్రాఫిక్‌ సమస్య తీవ్రరూపం దాల్చింది. ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకు ప్రధాన రహదారులు, వీధులూ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. ఒకవైపు శాసనసభా సమావేశాలు, ఈనెల 11న ఫార్ములా-ఈ రేసింగ్‌, 15 వరకు నుమాయిష్‌, 17న నూతన సచివాలయం ప్రారంభం, 18న శివరాత్రి వేడుకలు జరగనున్నాయి. మరో 10 రోజులపాటు వాహనదారులు నరకం చవిచూడక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ట్రాఫిక్‌ పోలీసులు 24 గంటలు విధులు నిర్వర్తిస్తున్నా పరిస్థితిని చక్కదిద్దటం సవాలుగా మారింది.

గ్రేటర్‌ హైదరాబాద్‌లో సుమారు 80 లక్షలకుపైగా వాహనాలున్నాయి. వీటిలో 30-40 లక్షలు రాకపోకలు సాగిస్తుంటాయని అంచనా. ఉదయం, సాయంత్రం రద్దీ కారణంగా 10-12 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు 30-40 నిమిషాలు వెచ్చించాల్సి వస్తోంది. కొద్దిరోజులుగా కిలోమీటరు దూరానికే 50-60 నిమిషాలు పడుతోందంటూ వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే ట్రాఫిక్‌ సమస్య ఎక్కువగా పెరిగేందుకు నిబంధనల ఉల్లంఘనులే ప్రధాన కారణమని పోలీసులు చెబుతున్నారు. నగరంలో ట్రాఫిక్‌ నిబంధనలు పాటించని వారిపై ప్రతిరోజూ సుమారు 17,000 చలానాలు నమోదవుతుంటాయి. వీరిలో అధికశాతం నో పార్కింగ్‌, రాంగ్‌ రూట్‌, ట్రిపుల్‌ రైడింగ్‌, హెల్మెట్‌ ధరించకపోవటం, అధిక వేగం, మైనర్ల డ్రైవింగ్‌, డ్రంకన్‌ డ్రైవింగ్‌, నంబరు ప్లేటు, లైసెన్స్‌ లేనివారే ఉంటున్నారు. ప్రధాన మార్గాల్లో ఇష్టానుసారం చేరుతున్న తోపుడు బండ్లు, దుకాణాల వద్ద వాహనాలు నిలపటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారుతున్నట్టు పోలీసులు గుర్తించారు. వాటిని తొలగించేందుకు ట్రాఫిక్‌ పోలీసులు సిద్ధమయ్యారు. ఇవాళ, రేపు (శుక్రవారం) తనిఖీలు చేపట్టి ఉల్లంఘనులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయనున్నట్లు సమాచారం.

మరోవైపు ఈ నెల 11న అంతర్జాతీయస్థాయిలో జరిగే ఫార్ములా-ఈ రేసింగ్‌ పోటీలకు 21,000 మందికి పైగా వస్తారని అంచనా. దీంతో రేసింగ్‌ నిర్వహించే ఎన్టీఆర్‌ మార్గ్‌, సచివాలయం, తెలుగుతల్లి పరిసర ప్రాంతాలను పూర్తిగా మూసివేశారు. రేసింగ్‌ జరిగే రోజు సికింద్రాబాద్‌-ట్యాంక్‌బండ్‌ వైపు మార్గాల్లో వెళ్లేందుకు అనుమతించరు. వచ్చే శని, ఆదివారాల్లో ట్రాఫిక్‌ నియంత్రణకు అదనంగా 500 నుంచి 600 మంది వరకు రంగంలోకి దింపేందుకు పోలీసు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా.. వాహనదారులకు కూడా పోలీసులు సూచనలు జారీ చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పక్కాగా పాటించి సహకరించాలని కోరుతున్నారు.

Read More Telangana News And Telugu News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *