Audio leak: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర.. 14వ రోజు గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ పాదయాత్రలో భాగంగా.. లోకేష్ వివిధ వర్గాల ప్రజలతో మమేకం అవుతూ ముందుకు సాగుతున్నారు. అయితే.. లోకేష్ పాదయాత్రపై అధికార వైఎస్సార్సీపీ సెటైర్లు వేస్తోంది. అసలు యువగళం (Yuvagalam) పాదయాత్రకు ప్రజలు రావడం లేదని.. ఈ విషయాన్ని టీడీపీ నేతలే చెబుతున్నారని విమర్శలు చేస్తున్నారు. ఈ సమయంలో.. వారికి మరో ఆయుధం దొరికింది.
టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (Atchannaidu) లోకేష్ పాదయాత్ర గురించి మాట్లాడిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో.. ‘ఉదయం పూట, లంచ్ తర్వాత పాదయాత్రలో జనాలు పలుచగా ఉంటున్నారు. ఈ రెండు సమయాల్లో ప్రజలు ఉండేలా చూడాలి. ఒక ఊరి ప్రజలు మరో గ్రామం వరకు వచ్చేలా చూసుకోవాలి’ అని అచ్చెన్నాయుడు మాట్లాడారు. గంగాధర నెల్లూరు టీడీపీ ఇంఛార్జ్ చిట్టి బాబు నాయుడుతో మాట్లాడినట్టు ఆడియో సర్క్యులేట్ అవుతోంది. ఈ ఆడియో ఒరిజినలా.. ఫేకా.. అనేది తేలాల్సి ఉంది.
ఇటు.. Lokesh పాదయాత్రపై చంద్రబాబు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని తెలుస్తోంది. పాదయాత్రకు జనాన్ని తీసుకురావాలంటూ నేరుగా చంద్రబాబే రంగంలోకి దిగారని ప్రచారం జరుగుతోంది. చిత్తూరు టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. వారికి క్లాస్ పీకారని తెలుస్తోంది. ఎంతో బాగా చేయాలనుకున్న యాత్రకు.. నేతలు జనాన్ని తీసుకురాలేకపోతున్నారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని నమ్మి ఎలా బాధ్యతలు అప్పగించాలంటూ చంద్రబాబు (Chandrababu) ప్రశ్నించినట్టు ప్రచారం జరిగింది. అది కొనసాగుతుండగైనే.. అచ్చెన్నాయుడి ఆడియో కలకలం సృష్టిస్తోంది.
ఇప్పుడే కాదు.. గతంలోనూ అచ్చెన్నాయుడికి సంబంధించిన వీడియో సంచలనంగా మారింది. తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక పూర్తవగానే పార్టీ లేదు.. బొక్కా లేదు.. అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించినట్లుగా ఉన్న వీడియో ఒకటి బాగా వైరల్ అయ్యింది. టీడీపీకి చెందిన ఒకరు అచ్చెన్నయుడితో గోడు వెళ్లబోసుకుంటుండగా.. ఆయన ఈ కామెంట్స్ చేసినట్లు ఆ వీడియోలో ఉంది. అయితే.. అది మార్ఫింగ్ వీడియో అని టీడీపీ కొట్టిపారేసింది. ఇప్పుడు కూడా.. ఈ ఆడియో ఒరిజినల్ కాదని తెలుగుదేశం పార్టీ (Telugudesam Party) నేతలు చెబుతున్నారు.
Read Latest
Andhra Pradesh News
and