కాబూల్ ఎయిర్పోర్ట్కు అఫ్గాన్ల పరుగులు ఇస్లామాబాద్ : భూకంప బాధితులకు సాయం చేయడానికి విమానాలు టర్కీకి వెళ్తున్నాయన్న పుకార్లతో వందల మంది అఫ్గాన్లు కాబూల్ ఎయిర్పోర్ట్కు పరుగులు తీశారు. ఇందులో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. బుధవారం నుంచి ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో వందల మంది తమ కుటుంబాలతో చీకట్లో, చలిలో నడుచుకుంటూ ఎయిర్పోర్ట్కు బయలుదేరారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టర్కీకి విమానాలు వెళ్తున్నాయని తెలుసుకొని, ఆ దేశ ప్రజలకు సాయం చేద్దామని తాను కూడా ఎయిర్పోర్ట్ వెళ్లానని కాబూల్ వాసి ఒకరు చెప్పాడు. అలాగే, కుటుంబంతో సహా దేశం దాటేందుకు ఇది మంచి అవకాశంగా భావించినట్లు పేర్కొన్నాడు. మూడు గంటలు ఎయిర్పోర్ట్ దగ్గర చలిలో వెయిట్ చేశామని, అయితే, టర్కీకి విమానాలు వెళ్లడం లేదని తాలిబాన్ దళాలు చెప్పడంతో వెనుదిరగాల్సి వచ్చిందన్నారు. కాబూల్ పోలీస్ చీఫ్ ఖలీద్ జద్రాన్ మాట్లాడుతూ, ఇప్పటివరకు టర్కీకి విమానాలు వెళ్తున్నాయన్న విషయంలో వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు.
©️ VIL Media Pvt Ltd.