కేప్టౌన్: మహిళల టీ20 వరల్డ్ కప్లో భాగంగా భారత్తో జరుగుతోన్న మ్యాచ్ పాకిస్థాన్ భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న పాక్.. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. కెప్టెన్ బిస్మా మరూఫ్ (55 బంతుల్లో 68 నాటౌట్), ఆయేషా నసీమ్ (25 బంతుల్లో 43) దూకుడుగా ఆడటంతో భారత్ ముందు పాకిస్థాన్ భారీ లక్ష్యాన్ని ఉంచింది.
టాస్ గెలిచిన బిస్మా బ్యాటింగ్ ఎంచుకోగా.. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే జావేరియా ఖాన్ (8)ను ఔట్ చేసిన దీప్తి శర్మ భారత్కు శుభారంభాన్ని ఇచ్చింది. కానీ మరో ఓపెనర్ మునీబా అలీ (12)తో కలిసి కెప్టెన్ బిస్మా రవూఫ్ స్కోరు బోర్డును ముందుకు నడిపించింది. వీరిద్దరూ కలిసి రెండో వికెట్కు 32 పరుగులు జోడించారు. కానీ వరుస ఓవర్లలో మునీబా, నిదా దార్ (0) ఔట్ కావడంతో పాక్ 43 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆచితూచి ఆడిన సిద్రా అమీన్ (11)ను రాధా యాదవ్ పెవిలియన్ చేర్చడంతో పాకిస్థాన్ 12.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది.
ఓ ఎండ్లో వికెట్లు పడుతున్నప్పటికీ.. కెప్టెన్ బిస్మా మరో ఎండ్లో పాతుకుపోయింది. ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ఆయేషా ఆరంభం నుంచే భారీ షాట్లతో విరుచుకుపడింది. వీరిద్దరూ దూకుడుగా ఆడి ఐదో వికెట్కు అజేయంగా 81 పరుగులు జోడించడంతో పాకిస్థాన్ 20 ఓవర్లలో 149 పరుగులు చేసింది. 55 బంతుల్లో 68 పరుగులతో నాటౌట్గా నిలిచిన బిస్మాకు భారత్పై ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం గమనార్హం.
ఈ మ్యాచ్లో భారత అమ్మాయిలు ఫీల్డింగ్ అద్భుతంగా చేశారు. కానీ చివరి రెండు ఓవర్లలో ఆయేషా ఇచ్చిన రెండు క్యాచ్లను జారవిడిచారు. దీంతో పాక్ అదనంగా 8 పరుగులు చేయగలిగింది. 19వ ఓవర్లో చేతిలో పడిన క్యాచ్ను బౌండరీలైన్ వద్ద రాధా యాదవ్ వదిలేసింది. చివరి ఓవర్లో బౌండరీలైన్ దగ్గర హర్లీన్ క్యాచ్ అందుకోలేకపోయింది. దీంతో అది సిక్స్గా వెళ్లింది. వేలి గాయం కారణంగా భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధన్నా ఈ మ్యాచ్కు దూరంగా ఉంది.