కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో తండ్రీకూతురు ఘోర ప్రమాదానికి గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సక్కుర్తి వీరాంజనేయులు, ఆయన కుమార్తె సక్కుర్తి మానస కలిసి ఇద్దరు బైక్పై వెళ్తున్నారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తూ, మరికాపట్లో గమ్యానికి చేరుకుంటారనగా.. ఉన్నట్లుండి బైక్ నడుపుతున్న వీరాంజనేయులు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఇద్దరూ రోడ్డు ప్రమాద బారిన పడ్డారు.
ఈ ఘటన కృష్ణా జిల్లా, గన్నవరం మండలం కేసరపల్లి వద్ద చోటుచేసుకుంది. వీరాంజనేయులు, ఆయన కుమార్తె మానస గన్నవరం నుంచి విజయవాడకు బైక్పై బయల్దేరారు. ఈ క్రమంలో వీరాంజనేయులకు ఒక్కసారిగా ఫిట్స్ వచ్చాయి. దీంతో బైక్ అదుపుతప్పి బుడమేరు వంతెనను ఢీకొట్టి పల్టీలు కొట్టగా.. పక్కనే కాలువలోకి తండ్రీకూతురు పడిపోయారు.
దీంతో తండ్రి సక్కుర్తి వీరాంజనేయులు, మానస తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సమాచారం అందిన వెంటనే 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరినీ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరాంజనేయులు పరిస్థితి విషమంగా ఉండగా.. కుమార్తె సక్కుర్తి మానసకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఇద్దరికీ చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.