టర్కీ(Turkey), సిరియా(Syria)ల్లో సంభవించిన భూకంపం(earth quake) తరహాలోనే భారత్లోనూ భారీ భూకంపం సంభవించే అవకాశముందా..? భారత్లోని కొన్ని ప్రాంతాల్లో భూకంపం ఎప్పుడైనా సంభవించవచ్చా….! అంటే అవుననే అంటున్నారు డచ్ పరిశోధకుడు ఫ్రాంక్ హూగర్ బీట్స్(Frank Hoogerbeets). టర్కీ, సిరియా భూకంపాన్ని ముందే పసిగట్టిన ఫ్రాంక్.. భారత్లోనూ ఇదే తరహా భూకంపం వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. సిరియా, టర్కీల్లో భూకంపాలను అంచనా వేసిన ఫ్రాంక్ న్యూస్ ఛానెల్ ఇండియా టుడే(India Today)తో ప్రత్యేకంగా మాట్లాడారు. భారత్, అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్ ప్రాంతంలో కూడా భారీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందన్నారు ఫ్రాంక్.
భారత్కు భారీ భూకంప ముప్పు?
టర్కీ, సిరియాలో 7.5 తీవ్రతతో భారీ భూకంపం వస్తుందని.. ఫ్రాంక్ ఫిబ్రవరి 3న ట్వీట్ చేశారు. అయన ట్వీట్ చేసిన తర్వాత అతనిపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. కొంతమంతి ఎగతాళి చేశాడు.. అయితే ఫ్రాంక్ ట్వీట్ చేసిన మూడు రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 6న నిజంగానే టర్కీ, సిరియాలో భారీ భూకంపం సంభవించింది. దీంతో ఫ్రాంక్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. గ్రహాల కదలికలు, వాటి ప్రభావం ఆధారంగా అంచనా వేసినట్లు ఫ్రాంక్ చెబుతున్నారు. ఇదే సమయంలో భారత్లో భూకంపం వచ్చే అవకాశముందా అని ఆయన్ను ఇండియా టూడే యాంకర్ క్వశ్చన్ చేశారు. అందుకు అయన ఇచ్చిన సమాధానం టెన్షన్ పెడుతోంది.
ఛాన్స్ ఉంది.. కచ్చితత్వం లేదు:
2001 గుజరాత్(Gujarat) భూకంపం గుర్తింది కదా..? వేల మందిని పొట్టనబెట్టుకున్న ఆ భూప్రళయానికి చెందిన చేదు జ్ఞాపకాలు ఇంక కళ్ల ముందు కదలాడుతునే ఉన్నాయి. 2001 కచ్ భూకంపం.. దేశంలో మూడవ అతిపెద్దది. ఈ విధ్వంసంలో 13,800 మందికి పైగా మరణించారు. లక్షా 67 వేలమందికిపైగా గాయలయ్యాయి. అలాంటి ముప్పు భారత్కు మళ్లీ పొంచి ఉండే అవకాశాలను కొట్టిపారేయలేమన్నారు ఫ్రాంక్. అయితే ఇది ఛాన్స్ మాత్రమేనని.. ఇందులో ఎలాంటి కచ్చితత్వం లేదన్నారు. భారత ప్రభుత్వం తనను సంప్రదిస్తే.. తమ వద్ద ఉన్న వివరాలను పంచుకోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నానన్నారు ఫ్రాంక్. ఇక టర్కీ, సిరియా దేశాలను భారీ భూకంపాలు కుదిపేయడంతో భూకంపం అంటేనే ప్రజలు హడలిపోయే పరిస్థితి నెలకొంది. మరోవైపు టర్కీ, సిరియా భూకంపం మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటివరకు 34వేల మందికిపైగా మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.