అమరావతిని చారిత్రక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక, యువజన, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి వెల్లడించారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డితో కలిసి మంగళవారం మంత్రి రోజా అమరావతిలో పర్యటించారు. ఈ సందర్భంగా అమరావతిలోని జ్ఞాన బుద్ధ ప్రాజెక్టును సందర్శించారు. బుద్దవనం మ్యూజియాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బుద్ధిష్ట్ సర్క్యూట్ను ప్రారంభించారు.
అనంతరం మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకారం అందిస్తున్నారని చెప్పారు. అమరావతిని కేవలం పుణ్యక్షేత్రాల సందర్శన కోసం కాకుండా.. కుటుంబం మొత్తం ఈ ప్రాంతంలో పర్యటించేలా పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
వాటర్ స్పోర్ట్స్ టూరిజం, టెంపుల్ టూరిజంతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి రోజా అన్నారు. ప్రపంచంలోని ఎన్నో దేశాల నుంచి ఉన్న తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు వస్తున్నారని తెలిపారు. రాయలసీమలో హార్స్లీ హిల్స్, తలకోన వంటి పర్యాటక ప్రదేశాలు అభివృద్ధి చేస్తామని మంత్రి రోజా ప్రకటించారు.