విశాఖలో విషాదకర ఘటన.. డబ్బుల్లేక స్కూటీపై పసికందు మృతదేహం

విశాఖలో(Vizag) విషాదకర ఘటన చోటు చేసుకుంది. పుట్టిన కొన్ని రోజులకే పసికందు చనిపోయింది. అయితే ఆ బిడ్డ మ‌ృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆస్పత్రి సిబ్బంది కనీసం అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయలేదు. ఈ దారుణ ఘటన విశాఖ కేజీహెచ్‌లో జరిగింది. కేజీహెచ్‌ (KGH) లో చనిపోయిన బిడ్డ (dead body) ను తీసుకెళ్తేందుకు ఆర్థిక స్తోమత లేక ఆ తల్లిదండ్రులు.. అంబులెన్స్ (Ambulance) ఏర్పాటు చేయాలని ప్రాధేయపడ్డారు. కానీ ఎంత బతిమాలినా ఆస్పత్రి సిబ్బంది కనికరపడలేదు.

అయితే పాపం వారి వద్ద ప్రైవే టు అంబులెన్స్‌కు చెల్లించేంత  డబ్బులు లేవు. దీంతో పాపం ఆ చిన్నారి తల్లిదండ్రులు గత్యంతరం లేక మృతదేహాన్ని స్కూటీ (scooty )పై పెట్టుకుని పాడేరు (Paderu) వరకు వెళ్లారు. పసికందు డెడ్ బాడీతో దాదాపు  120 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. అక్కడ విషయం తెలుసుకున్న ఆ ప్రాంత ఆస్పత్రి సిబ్బంది.. పాడేరు నుంచి స్వగ్రామానికి వెళ్లేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేశారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డను కోల్పోయామని తల్లిదండ్రులు ఆరోపించారు.

తమ బిడ్డ పుట్టినప్పుడు బ్రెయిన్‌కు ఆక్సిజన్ అందడం లేదని.. డాక్టర్లు కేజీహెచ్‌కు తీసుకెళ్లామన్నారని తల్లిదండ్రులు తెలిపారు. అయితే కేజీహెచ్‌లో అడ్మిట్ చేసి పదిహేను రోజులు అవుతున్నా.. బాబు పరిస్థితి మెరుగుపడలేదన్నారు. అసలు కేజీహెచ్ సిబ్బంది ఎలాంటి వైద్యం అందించారో కూడా మాకు తెలియదన్నారు. కేవలం టెస్టుల పేరుతో చిన్నారి రక్తం మాత్రం తీసారని ఆరోపించారు.

మరోవైపు ఆస్పత్రి సిబ్బంది మాత్రం అలాంటిదేం లేదని అంటున్నారు. తాము అంబులెన్స్ ఏర్పాటు చేశామని చెబుతున్నారు. అయితే అంబులెన్స్ ఏర్పాటుకు కాస్త సమయం పడుతుందని..అంతవరకు వెయిట్ చేయలేదు.. చిన్నారి తల్లిదండ్రులు మృతదేహం తీసుకొని… వారి బైక్ పైనే వెళ్లిపోయారని ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఘటనపై జనం మాత్రం మండిపడుతున్నారు. బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులకు ఆస్పత్రి సిబ్బంది మరింత క్షోభకు గురి చేశారని విమర్శిస్తున్నారు . మరికొందరు కేజీహెచ్‌లో ఇదేం కొత్త కాదని.. అలాగే ఉంటుందని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *