గత నెల నేపాల్లో యతి ఎయిర్లైన్స్ విమాన ప్రమాదంలో ఐదుగురు భారతీయులు సహా 72 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం మానవ తప్పిదం వల్లే జరిగినట్టు ప్రాథమిక విచారణ నివేదిక పేర్కొంది. జనవరి 15న ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కాస్కీ జిల్లాలోని పొఖారాకు బయలుదేరిన విమానం టేకాఫ్ అవుతుండగా సేతి నది ఒడ్డున కూలిపోయింది. ఆ సమయంలో సిబ్బంది సహా విమానంలో 72 మంది ఉండగా… వీరంతా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఘటన తర్వాత 71 మృతదేహాలను గుర్తించగా.. మిస్సైయిన వ్యక్తి కూడా చనిపోయి ఉంటాడని నిర్దారణకు వచ్చారు. గత ఐదేళ్లలో నేపాల్లో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం ఇదే.
రెండు ఇంజన్లు కలిగిన విమానాలు రెక్కలు ఉండే స్థానానికి రావడం చాలా అరుదని ఐదుగురు సభ్యుల దర్యాప్తు కమిటీ సభ్యులలో ఒకరు చెప్పారు. ఇదే విషయాన్ని నేపాల్ పర్యాటక, పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో పోస్ట్ చేసిన 14 పేజీల ప్రాథమిక నివేదికలో కూడా ప్రస్తావించారు. ‘‘ప్రమాదంలో మానవ కారకాన్ని విస్మరించలేం… కాబట్టి ఇది విచారణకు సంబంధించిన అంశం’’ అని పేరు చెప్పడానికి నిరాకరించిన ఓ సభ్యుడు అన్నారు.
‘‘9N-ANC రెండు ఇంజన్లు విమానం ప్రయాణ సమయంలో ఓవర్ టార్క్ను నిరోధించడానికి ఫ్లైట్ ఐడల్ కండిషన్ను నడుపుతున్నట్లు దర్యాప్తు బృందం గమనించింది.. ఫ్లైట్ డేటా రికార్డర్ (FDR) ప్రకారం ఇంజిన్లకు సంబంధించిన అన్ని పారామీటర్లు సక్రమంగా ఉన్నాయి.. ఎటువంటి లోపాలు లేవు’’ నివేదిక పేర్కొంది.
‘‘ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ATC) 10:57:07 గంటలకు ల్యాండింగ్ కోసం క్లియరెన్స్ ఇచ్చినప్పుడు ఇంజిన్ల నుంచి ఎటువంటి చోదక శక్తి రావడం లేదని పైలట్ ఫ్లయింగ్ (PF)రెండుసార్లు పేర్కొంది.. క్రాష్ సమయంలో ఆకాశంలో అక్కడక్కడా మేఘాలు ఉన్నా 6 కి.మీ మేర విజిబిలిటీ దాదాపు స్పష్టంగా ఉంది’’ అని ప్రాథమిక నివేదిక తెలిపింది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పైలట్లు అనుకోకుండా కండిషన్ లివర్లను లాగడం వల్ల ఇంజిన్ ఆగిపోయి రెక్కలు ముడుచుకుపోయాయి.. ప్రతి లివర్ ఇంధన సరఫరా ప్రారంభం, ఆపివేయడం, దాని సంబంధిత ఇంజిన్ కోసం నిష్క్రియ వేగాన్ని నియంత్రిస్తుంది. ఘటనా స్థలిలో లివర్లు కిందకు లాగినట్లు కనుగొన్నారని విచారణ కమిటీలో సభ్యుడు ఒకరు తెలిపారు.
‘మేము వివరణాత్మక నివేదిక కోసం ఎదురు చూస్తున్నాం.. అంతకు ముందు ఏమి జరిగిందో మేం నిర్ధారించలేం’ అని ఆయన పేర్కొన్నారు. ‘అవును, ఫ్లాప్స్లో సమస్య కూడా ఉంది. ఫ్లాప్లను పొడిగించడంలో పైలట్లు ఎందుకు ఆలస్యం చేశారనే సందేహాలు ఉన్నాయి.. సాధారణ చెక్లిస్ట్లు అనుసరించలేదు.. పరిశీలించాల్సిన అనేక అంశాలు ఉన్నాయి’దర్యాప్తు కమిటీలో సభ్యుడు, టూరిజం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ బుద్ధి సాగర్ లామిచానే వ్యాఖ్యానించారు.
Read Latest International News And Telugu News