కాంగ్రెస్ పార్టీకి చాలా స్థానాల్లో అభ్యుర్థులే దిక్కులేరని.. అయినా పార్టీ నేతలు అధికారంలోకి వచ్చేది తామే అంటూ పగటి కలలు కంటున్నారని మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న హరీశ్ రావు.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. 2001లో గులాబీ జెండా పట్టుకున్నప్పుడు.. అన్నింటికీ కరువే ఉండేదని గుర్తు చేసుకున్నారు. అలాంటి దుర్భర పరిస్థితి నుంచి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధించి.. అభివృద్ధిలో దూసుకుపోతున్నామని చెప్పుకొచ్చారు. 44 డిగ్రీల ఎండలోనూ సమావేశానికి ఇంత మంది రావటమే బీఆర్ఎస్ బలానికి నిదర్శనమన్న హరీశ్ రావు… మొన్న రేవంత్ రెడ్డి మీటింగ్కు 500 మంది కూడా రాలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి 40 నుంచి 50 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులే దిక్కులేరని.. అధికారం ఎలా వస్తుందని ప్రశ్నించారు.
మరోవైపు.. బీజేపీపై కూడా హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. తెలంగాణ వస్తే ఏమొచ్చిందని బీజేపీ నేతలు అడుగుతున్నారని.. దానికి సమాధానం ఏ పల్లెనడిగినా చెబుతుందని హరీశ్ రావు పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం ఉన్న మహారాష్ట్రలో మంచి నీళ్లు పది రోజులకు ఓసారి వస్తాయని వివరించారు. పుణేలాంటి నగరాల్లోనూ వారానికోసారి వస్తాయంటూ చెప్పుకొచ్చారు. గుజరాత్లో అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే.. సాయం కింద కేవలం 12 వేల రూపాయలు ఇస్తారని.. అదే తెలంగాణలో కల్యాణలక్ష్మి కింద లక్ష రూపాయలు ఇస్తున్నామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ హయాంలో మైగ్రేషన్ పాలన ఉంటే.. బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్ పాలన ఉందంటూ చెప్పుకొచ్చారు హరీశ్ రావు. కాంగ్రెస్ చెప్పే అబద్దాలను తిప్పి కొట్టాలని హరీశ్ పిలుపునిచ్చారు. తెలంగాణలో ప్రతిపక్షాలు ప్రకృతి వైపరీత్యాల కన్నా డేంజరస్గా తయారయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కోసమే పోరాడుతుందని.. ఇక అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. ఇక బీజేపీకైతే డిపాజిట్లు కూడా దక్కేటట్టు లేవని చెప్పుకొచ్చారు హరీశ్ రావు.
100554863
100568941
Read More Telangana News And Telugu News