అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఐపీఎల్ 16 వ ఫైనల్ పోస్ట్ పోన్ అయింది. రిజర్వ్ డే అంటే సోమవారం ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ జరగనుంది. 11 గంటలకు వర్షం ఆగిపోయినా గ్రౌండ్ ను సిద్ధం చేయడానికి టైం పట్టేలా ఉండటంతో అంపైర్లు మ్యాచ్ ను రిజర్వ్ డేకి వాయిదా వేశారు. అంతకుముందు.. సూపర్ సండే లో బ్యాటర్ల మెరుపులు లేవు.. బౌలర్ల జోరు లేదు. కేవలం వర్షం మాత్రమే ఉంది. ఈ మెగా ఫైట్ కు వర్షం అంతరాయం కలిగించింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారీ వర్షం కురిసింది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ఫైనల్కు గంట ముందు వర్షం ప్రారంభమైంది. దీని కారణంగా మ్యాచ్ సమయానికి ప్రారంభం కాలేదు. ఆ తర్వాత కాసేపు గ్యాప్ ఇచ్చిన మళ్లీ భారీ వర్షం కురిసింది. ఆ తర్వాత ఆగినా.. గ్రౌండ్ సిద్ధంగా లేకపోవడంతో మ్యాచ్ ను రిజర్వ్ డేకి వాయిదా వేశారు అంపైర్లు. దీంతో.. ఫ్యాన్స్ నిరాశగా వెనుదిరిగారు.
అయితే.. రేపు కూడా భారీ వర్షం కురిసే అవకాశమున్నట్లు స్థానిక వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో ఫైనల్ జరుగుతుందా లేదా అనే ప్రశ్నలు అందరిలోనూ నెలకొంది. టాస్ పడకుండానే ఆదివారం ఆట రద్దవ్వడంతో.. టాస్ నుంచి మ్యాచ్ ను ఆరంభిస్తారు. ఒకవేళ రిజర్వ్ డే రోజున కూడా ఫైనల్ నిర్వహించడం సాధ్యం కాకపోతే.. అప్పుడు విజేత ఎవరు నిలుస్తారు?
అటువంటి సందర్భంలో లీగ్ టేబుల్లో మెరుగైన స్థానంలో నిలిచిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. చెన్నై, గుజరాత్ మధ్య జరగాల్సిన ఫైనల్ పోరు వర్షం కారణంగా రిజర్వ్ డే రోజు కూడా నిర్వహించలేకపోతే.. అప్పుడు లీగ్ టేబుల్లో టాపర్ గా నిలిచిన గుజరాత్ ను చాంపియన్ గా ప్రకటిస్తారు. దీంతో.. చెన్నై ఫ్యాన్స్ మ్యాచ్ ఎలాగైనా జరగాలని కోరుకుంటున్నారు.
ఈ సీజన్ లో ఈ రెండు జట్లు ఇప్పటికే రెండుసార్లు ఎదురుపడ్డాయి. టోర్నీ ప్రారంభ మ్యాచ్ ఈ రెండు జట్ల మధ్యే జరిగిన విషయం తెలిసిందే. ఆ మ్యాచులో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో బోణీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేయగా.. గుజరాత్ 4 బంతులు మిగిలివుండగానే ఆ లక్ష్యాన్ని ఛేదించింది. మరోసారి ఈ రెండు జట్లు ప్లేఆఫ్స్లో తారసపడ్డాయి. తొలి క్వాలిఫయర్ మ్యాచులో ధోనీ సేన గుజరాత్ టైటాన్స్పై సునాయాస విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 172 పరుగులు చేయగా.. హార్దిక్ టీమ్ దాన్ని ఛేదించలేకపోయింది 157 పరుగులే కుప్పకూలింది.