26 మంది సైనికుల మృతి..క్షతగాత్రుతో వెళ్తున్న హెలికాఫ్టర్ కూల్చివేత అబుజా: నైజీరియా దేశం బందిపోట్ల గుప్పిట్లో చిక్కి విలవిల్లాడుతోంది. తాజాగా భద్రతా దళాలపై జరిపిన ఆకస్మిక దాడుల్లో 26 మంది సైనికులు మృతి చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని రక్షించేందుకు వెళ్లిన హెలికాప్టర్ గాయపడిన వారిని తీసుకుని వెళ్తుండగా ముష్కరుల దాడిలో కూలిపోయింది. ఈ మేరకు అధికారులు వెల్లడించారు.
నైజీరియాలో కొంతకాలంగా క్రిమినల్ గ్రూపులు, సైనికులకు మధ్య పోరాటం జరుగుతోంది. ఆ దేశంలోని నైజర్, కడునా, జంఫారా, కట్సినా రాష్ట్రాల్లోని అడవుల్లో ఈ ముఠాలు శిబిరాలు ఏర్పాటు చేసుకున్నాయి. కిడ్నాప్లు, స్కూళ్లపై దాడులకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. అడ్డొచ్చిన వారి ఇళ్లను దహనం చేస్తున్నాయి. ఈ క్రమంలో సెంట్రల్ నైజీరియాలో సైనికులను ట్రాప్ చేసి ఏకంగా వారిపై దాడులకు పాల్పడ్డారు.
©️ VIL Media Pvt Ltd.