ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెరిగాయి. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం పెంచిన వేతనం ఈ నెల 11 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు 37 శాతం పెంచింది ప్రభుత్వం. మొత్తం 27వేల మంది విద్యుత్ శాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. సీఎం జగన్ సూచనలతో విద్యుత్ శాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచినట్టు తెలిపారు. తాజాగా ప్రభుత్వం నిర్ణయంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతం రూ.21వేలు దాటింది. అలాగే, గ్రూప్ ఇన్యూరెన్స్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం కాంట్రాక్ట్ ఏజెన్సీలను ఆదేశించింది.
హై స్కిల్డ్ ఉద్యోగికి రూ.22,589 నుంచి రూ.30, 605కు జీతం పెరిగింది. స్కిల్డ్ ఉద్యోగికి 20,598 నుంచి రూ.27,953లకు పెంచారు. సెమీ స్కిల్డ్ ఉద్యోగికి రూ.17,144 నుంచి రూ.23, 236 కు శాలరీ పెరిగింది. అన్ స్కిల్డ్ ఉద్యోగికి రూ.16,473 నుంచి 22,318 కు జీతం పెంచారు. జీతాల పెంపుపై ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు.. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. చాలా కాలంగా విద్యుత్ శాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరుతున్నారు. విధి నిర్వహణలో ఉద్యోగి మృతి చెందితే కారుణ్య నియామకం కింద కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరుతున్నారు.
ఇటీవల విద్యుత్ ఉద్యోగులు తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ సమ్మెకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగులతో జరిపిన చర్చలు ఫలించాయి. ఉద్యోగ సంఘాల నేతలు పీఆర్సీపై ఎట్టకేలకు అంగీకారం తెలిపారు. ఒప్పందంపై యాజమాన్యం, ఉద్యోగ సంఘాల సంతకాలు చేశారు. ఆ వెంటనే సమ్మె నోటీసు ఉపసంహరించుకున్నారు. ఉద్యోగులతో ప్రభుత్వం చర్చలు సఫలం అయ్యాయని.. సమ్మె విరమించడానికి జేఏసీ నేతలు ఒప్పుకున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తెలిపారు. 8 శాతం ఫిట్ మెంట్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నామని.. ఉద్యోగులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు మంత్రి. ఏవైనా చిన్నచిన్న సమస్యలుంటే పరిష్కరించుకుంటామని.. జేఏసీ నేతలు అందరూ సంతకాలు చేశారన్నారు.
ప్రభుత్వ విన్నపం,సంస్థను రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఒప్పుకున్నామన్నారు విద్యుత్ ఉద్యోగ సంఘాల నేత సాయి కృష్ణ. 8 శాతం ఫిట్ మెంట్ సంతృప్తిగా లేకపోయినా ఒప్పుకున్నామని.. సింగిల్ మాస్టర్ స్కెల్ 2.6 లక్షల తో పాటు 8 శాతం ఫిట్ మెంట్ ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారన్నారు. మొత్తం 12 డిమాండ్లలో 8 డిమాండ్లు పరిష్కారం అయ్యాయన్నారు. సమస్యలున్నా ప్రజలు ఇబ్బంది పడకూడదని నిర్ణయం తీసుకున్నామన్నారు. చర్చల్లో సంతృప్తి లేకపోయినా ఒప్పుకున్నామని.. కొంతమంది చర్చల్లో సంతృప్తి చెందలేదన్నారు. అలాంటి సంఘాలతో కూడా మాట్లాడి ఒప్పిస్తామన్నారు. అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలను భారీగా పెంచింది.
- Read Latest Andhra Pradesh News and Telugu News
ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్స్టైల్ అప్డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.