క్రికెట్ బెట్టింగులకు అలవాటు పడిన ఓ యువకుడు రక్తదాత అవతారం ఎత్తి మోసాలకు పాల్పడుతున్నాడు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం దానం చేస్తానంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో వందల మంది నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఇతడి కారణంగా చాలా మంది తమ ఆప్తులను పొగొట్టుకున్నట్లు తెలిసింది. హైదరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లాకు చెందిన రెడ్డి సందీప్ క్రికెట్ బెట్టింగులకు అలవాటుపడ్డాడు. ఏ పని చేయకుండా తేలికగా డబ్బు సంపాదించేందుకు రక్తం, ప్లాస్మాదానం చేస్తానంటూ మోసాలబాట పట్టాడు. రక్తం, ప్లాస్మాదాతలున్నారంటూ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసేవాడు.
ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో సర్జరీలు, ప్రమాదాల్లో తీవ్ర గాయాలైన బాధితులకు అవసరమైన గ్రూపు రక్తం కోసం బంధువులు ఇతడిని సంప్రదించేవారు. కావాల్సిన బ్లడ్ గ్రూపు చెప్పగానే తాను డోనర్స్ను తీసుకొని వస్తానంటూ అవతలి వారిని నమ్మించేవాడు. అలా వారి నుంచి ట్రాన్స్పోర్టు, భోజన ఖర్చులంటూ ముందుగానే డబ్బులు వసూలు చేసేవాడు. డబ్బు తన చేతికి అందగానే ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి కనిపించకుండా పోయేవాడు. ఇతడి మాటలు నిజమని నమ్మి ఎంతోమంది అత్యవసర సమయాల్లో తమ ఆప్తులను పోగొట్టుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
సందీప్పై హైదరాబాద్, విశాఖపట్నంలోని పలు పోలీసు స్టేషన్లలో కేసులు కేసులు నమోదయ్యాయి. అతడు పలుమార్లు జైలుకు సైతం వెళ్లివచ్చాడు. అయినా పద్ధతి మార్చుకోలేదు. ఇటీవల దోమలగూడ పోలీసు స్టేషన్ పరిధిలోనూ ఇలాంటి మోసానికే పాల్పడగా.. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీఎస్ పోలీసులు పక్కాగా నిఘా ఉంచి నిందితుడిని పట్టుకున్నారు. అనంతరం అతడిని రిమాండ్కు తరలించారు. సోషల్ మీడియాల ద్వారా గుర్తుతెలియని వ్యక్తులు, స్వచ్ఛందసంస్థల పేరిట రక్తదానం చేస్తామంటూ స్పందించేవారి పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. దాతల వివరాలు ముందే తెలుసుకోవాలని చెబుతున్నారు. అత్యవసర సమయాల్లో ఇలాంటి మోసగాళ్ల బారిన పడితే.. ఆప్తులను కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.