బీఆర్ఎస్‌కు తమిళిసై బిగ్ షాక్.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల తిరస్కరణ

తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అధికార బీఆర్ఎస్‌ పార్టీకి మరో షాక్ ఇచ్చారు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా సిఫారసు చేసిన అభ్యర్థుల సిఫార్సులను గవర్నర్ తిరస్కరించారు. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా కేసీఆర్ సర్కారు.. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను సిఫార్సు చేయగా.. గవర్నర్ తమిళిసై వాళ్లిద్దరి అభ్యర్థిత్వాలను తిరస్కరించారు. వాళ్లిద్దరూ సర్వీస్ సెక్టార్‌లో ఎలాంటి సేవ చేయలేదని.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాజ్‌భవన్ నుంచి లేఖ వచ్చింది. దీంతో.. మరోసారి ప్రగతిభవన్‌ వర్సెస్ రాజ్‌భవన్‌గా రాష్ట్ర రాజకీయం మారిపోయింది. ఇప్పుడు ఈ విషయంపై కేసీఆర్ ప్రభుత్వం ఎలా స్పందించనుందన్నది ఆసక్తికరంగా మారింది.

గతంలోనూ.. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డిని ప్రభుత్వం సిపార్సు చేయగా.. అప్పుడు కూడా తమిళిసై తిరస్కరించారు. అప్పటి నుంచే కేసీఆర్ సర్కారుకు గవర్నర్ తమిళిసైకి మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. కాగా.. మొన్నటి వరకు రాజ్‌భవన్‌కు ప్రగతిభవన్‌కు ఉన్న దూరం ఇప్పుడిప్పుడే తగ్గుతుందనుకుంటున్న వేళ.. ప్రభుత్వం సిఫార్సు చేసిన అభ్యర్థులను గవర్నర్ మరోసారి తిరస్కరించటంతో.. కథ మళ్లీ మొదటికే వచ్చినట్టయింది. మొన్నే కేసీఆర్ ఆహ్వానం మేరకు సచివాలాయానికి గవర్నర్ తమిళిసై విచ్చేసి.. ప్రార్థనా మందిరాలను ప్రారంభించారు కూడా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *